
అతిసార వ్యాప్తి ఆపుదాం
● ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ పిలుపు ● చైతన్య రథం ప్రారంభం
భువనేశ్వర్: రాష్ట్రంలో అతిసార వ్యాప్తి బెంబేలెత్తిస్తోంది. ప్రజా చైతన్యంతో ఈ సంక్రమణకు కళ్లెం వేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అతిసార ఆపుదాం (స్టాప్ డయేరియా) నినాదంతో చైతన్య ప్రచార రథాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ సోమవారం ప్రారంభించారు. ఢెంకనాల్ జిల్లా భువన్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణ నుంచి కాషాయ పతాకం ఊపి ఈ రథాన్ని ప్రారంభిచారు. ఈ ప్రచారం జూలై నెల 31 వరకు నిరవధికంగా కొనసాగుతుందని మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రత్యక్షంగా ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అతిసార నివారణ, నియంత్రణ కోసం సాధ్యమైన అన్ని చర్యలూ సకాలంలో చేపడుతున్నారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు, సంబంధిత పరికరాలు, మందులు, మౌలిక సదుపాయాలతోపాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ కేంద్రాలు, ఆరోగ్య దేవాలయాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు, మందులు అందుబాటులో ఉంచారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పని చేసే అన్ని క్షేత్ర స్థాయి ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం, బహుళార్థసాధక ఆరోగ్య కార్యకర్తలకు ప్రాథమిక దశ నుంచి అతిసార వ్యాధి గుర్తింపు శిక్షణ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అవగాహన సందేశాలు, ఓఆర్ఎస్, జింక్ మాత్రలు, ఇతర మందులకు సంబంధించిన సమాచార కరపత్రాలతో ఇంటింటికీ వెళ్లాలని మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ అన్ని వర్గాల ఆరోగ్య కార్యకర్తలను ఆదేశించారు. అతిసార లక్షణాలు కనిపించిన వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య చికిత్స పొందాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా అతిసార నివారణ కోసం హాజరైన తల్లులకు మంత్రి ఓఆర్ఎస్, జింక్ మాత్రల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఢెంకనాల్ ఎంపీ రుద్ర నారాయణ్ పాణి, పొరొజంగ్ ఎమ్మెల్యే బిభూతి ప్రధాన్, హిందోళ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్, కామాఖ్యనగర్ ఎమ్మెల్యే శత్రుఘ్న జెనా పాల్గొన్నారు. అతిసార కట్టడి సంబంధిత సమాచార సంచికను మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు.

అతిసార వ్యాప్తి ఆపుదాం