
రాజధానిలో కిడ్నాప్ కలకలం
భువనేశ్వర్: నగరంలో మంగళవారం ఉదయం సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో బెదిరించి మైనరు బాలుడిని దుండుగులు అపహరించుకు పోయారు. ఈ ఘటనలో స్థానికులు తీవ్రంగా కలవరపడ్డారు.
స్థానిక ఎయిర్ ఫీల్డ్ పోలీస్ ఠాణా పరిధిలోని పంచగావ్ సమీపంలో తుపాకీతో బెదిరించి పిల్లవాడిని కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు తలపై తుపాకీతో బెదిరించి బాలుడిని బలవంతంగా నల్లటి కారులోకి ఎత్తుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత కిడ్నాపర్లు ఆ చిన్నారి కుటుంబానికి ఫోన్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లిస్తే బాలుడిని సురక్షితంగా అప్పగిస్తామని చెప్పారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక నిఘా, స్థానిక నిఘా, వాహన ట్రాకింగ్ వ్యవస్థలను ప్రయోగించి చిన్నారిని సురక్షితంగా గుర్తించారు. పోలీసుల రాక గుర్తించి కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయారు. వారిని పట్టుకోవడానికి ముమ్మరంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు.
తుపాకీతో బెదిరించి బాలుడిని అపహరించిన దుండగులు
రంగంలోకి దిగిన పోలీసులు
బాలుడ్ని వదిలి పరారైన కిడ్నాపర్లు