భువనేశ్వర్: శాసనసభలో కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేసిన అనంతరం సభా కార్యక్రమాలను బుధవారం నాటికి నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో రాత్రంతా నిరసన ప్రదర్శనలు చేపడతామని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్య చేయబడిందన్నారు. ఇదో కళంకిత చరిత్రగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు నిరవధికంగా పోరాడుతామని హెచ్చరించారు. అలాగే సభ్యుల సస్పెన్షన్పై 27న అసెంబ్లీ ముట్టడిస్తామని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ తెలియజేశారు.
పోక్సో చట్టంపై అవగాహన
శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ఒకటో అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి పి.భాస్కరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీ 4వ లైన్లో ట్రైబల్ హాస్టల్ల్లో పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–పోక్సోపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల పట్ల అనేక నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. అశ్లీల చిత్రాలు చూపించడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్ జి.ఇందిరాప్రసాద్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏ.రాజారావు, ఆర్.అప్పలస్వామి, జి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.