సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆస్తులు వృద్ధి

- - Sakshi

భువనేశ్వర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ఆయన మంత్రి మండలి సభ్యుల ఆస్తుల వివరాలను శనివారం వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నవీన్‌ అందరి కంటే అధిక ధనవంతుడిగా స్పష్టమవుతోంది. 2022 సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపాస్తుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నవీన్‌ ఆస్తులు స్వల్పంగా వృద్ధి చెందగా, రుణ భారం లేకపోవడం విశేషం.

మంత్రి మండలిలో అత్యంత అల్ప ఆస్తిపరుడిగా గనులు – ఉక్కు శాఖ మంత్రి ప్రఫుల్ల మల్లిక్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడ ఆయన అందరి కంటే తక్కువ ఆస్తిపరుడుగా నిలిచారు. నవీన్‌ మంత్రి మండలిలో పలువురు కోటీశ్వరులు ఉన్నారు.

అధికారిక లెక్కల ప్రకారం
2022లో ముఖ్యమంత్రి ఆస్తుల వృద్ధి విలువ రూ.42,86,069 పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌ 31 నాటికి ఆయన ఆస్తుల విలువ రూ.65,40,79,694 కాగా, అంతకుముందు సంవత్సరం ఆస్తుల విలువ రూ.64.97 కోట్లకు పరిమితమైంది. అధికారిక పోర్టల్‌లోని ప్రకటన ప్రకారం, వివిధ బ్యాంకులు మరియు పోస్టాఫీసులలో డిపాజిట్లు మరియు వివిధ బాండ్ల పరంగా నవీన్‌ పొదుపు (నగదు) ఆస్తుల విలువ రూ.42,86,069లు పెరిగింది.

ముఖ్యమంత్రి చరాస్తుల విలువ రూ.12.52 కోట్లు. వీటిలో న్యూఢిల్లీ, భువనేశ్వర్‌, హింజిలికట్‌, బర్‌గడ్‌ బ్యాంకు ఖాతాల్లో నగదు, నగలు, నాలుగు చక్రాల వాహనం ఇమిడి ఉన్నాయి. బంగారు ఆభరణాల విలువ రూ. 3.49 లక్షలు కాగా, 1980 మోడల్‌కు చెందిన పాత అంబాసిడర్‌ కారు విలువ రూ.6,434గా పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి న్యూఢిల్లీలోని జన్‌పథ్‌ శాఖ బ్యాంకులో రూ.70.11 లక్షలు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భువనేశ్వర్‌ శాఖలో రూ.20.87 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి.

అలాగే రూ.52.88 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇవన్నీ అతని తల్లిదండ్రులు బిజు పట్నాయక్‌ మరియు జ్ఞాన్‌ పట్నాయక్‌ నుంచి సంక్రమించినవిగా పేర్కొన్నారు. ఈ స్థిరాస్తుల్లో భువనేశ్వర్‌లో నవీన్‌ నివాస్‌లో మూడింట రెండు వంతుల వాటా విలువ సుమారుగా రూ.9,52,46,190 కాగా, న్యూఢిల్లీ డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం రోడ్‌–3లో ఉన్న ఆస్తిలో 50% వాటా విలువ దాదాపు రూ.43,36,18,000గా ప్రకటించారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top