అనుమానాస్పద రీతిలో యువతి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద రీతిలో యువతి మృతి

Mar 27 2023 1:34 AM | Updated on Mar 27 2023 11:07 AM

- - Sakshi

రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్‌లో ప్రముఖ శైవక్షేత్రం దేవగిరి కొండపై ఉన్న కొలనులో అనుమానాస్పద రీతిలో యువతి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు కాసీపూర్‌ సమితి సుంగేరు గ్రామానికి చెందిన దేవకి గౌడొ(18)గా గుర్తించారు. దీనిపై ఐఐసీ ముకుందదేవ్‌ నాయక్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుంగేరు గ్రామానికి చెందిన దేవకితో పాటు మరో ముగ్గురు యువతులు కల్యాణ సింగుపూర్‌ లోని దేవగిరి మహావిద్యాలయంలో ప్లస్‌–త్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ముగ్గురూ స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నారు.

ఈ క్రమంలో ఏదో పనిమీద ఈనెల 22న దేవకి తన తోటి స్నేహితులకు చెప్పి, బయటకు వెళ్లింది. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో వారంతా పరిసరాలను గాలించారు. గురువారం దేవగిరి కొండపైకి వెళ్లి అన్ని దిశలా వెతికారు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు. అంతా కలిసి ఆదివారం సాయంత్రం దేవగిరి కొండపైకి వెళ్లి వెతకగా, దేవకీకి చెందిన కాలి చెప్పు కనిపించింది. దీంతో ఆందోళన చెందిన వారంతా.. కొండపై ఉన్న కొలనులో చూడగా యువతి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దీనిపై కల్యాణ సింగుపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో యువతి శవాన్ని బయటకు తీశారు. యువతి శరీరానికి పెద్ద బండరాయి కట్టి ఉండటంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది హత్యా? లేక ఆత్మహత్య అనే విషయంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement