డీఆర్ఎం మోహిత్ సోనాకియా
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సరుకు రవాణా భాగస్వామ్యాలను బలోపేతం చేసే దిశగా సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ శుక్రవారం వ్యాపారవేత్తలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న డీఆర్ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ బలమైన పారిశ్రామిక భాగస్వామ్యాలను పెంపొందించడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, సరుకు రవాణా పరిధిని విస్తరించేందుకు ఈ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సౌత్కోస్ట్ రైల్వే వ్యాప్తంగా సరుకు రవాణాలో విజయవాడ డివిజన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. డివిజన్ వ్యాప్తంగా 24 ప్రైవేటు స్లైడింగ్లు, టెర్మినల్స్, 29 సరుకు రవాణా గూడ్స్ షెడ్ల విసృత నెట్వర్కు ద్వారా బొగ్గు, ఎరువులు, సిమెంట్, ఆహార ధాన్యాలు, ఇనుప ఖనిజం, అల్యూమినియం, పీఎల్ఓ, లాటరైట్ వంటి కీలక వస్తువులను రవాణా చేస్తుందన్నారు. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో డివిజన్ 40.64 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ. 4,136 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించినట్లు తెలిపారు. తద్వారా పారిశ్రామిక ఆర్ధిక వృద్ధికి తోడ్పడటానికి డివిజన్ కీలకంగా మారిందన్నారు. నూతన ఆవిష్కరణలు, బలమైన పభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా మాత్రమే నిరంతర సరుకు రవాణా వృద్ధిని సాధించగలమని తెలిపారు. సరుకు రవాణా మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైల్వేలకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ వినీత్కుమార్, సీసీఎం డి.సత్యనారాయణ, సరుకు రవాణా వినియోగదారులు పాల్గొన్నారు.


