మచిలీపట్నంటౌన్: నగరంలోని చారిత్రక కోనేరుసెంటర్ శుక్రవారం ముస్లింలు భక్తి భావంతో చిందించిన రక్తంతో తడిసి ముద్దయింది. మొహర్రం దుఃఖ దినాల సందర్భంగా కోనేరు సెంటర్లో ముస్లింలు రక్త తర్పణం చేశారు. ప్రవక్త మహమ్మద్ మనవడైన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ఆయన అనుచరులు కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో వారు చేసిన సర్వోన్నత త్యాగాలను స్మరిస్తూ.. మచిలీపట్నంలో ముస్లింలు మొహర్రం దుఃఖ దినాల్లో భాగంగా 11వ రోజును భక్తిశ్రద్ధలతో, శోకతప్త హృదయాలతో రక్త తర్పణ నిర్వహించారు. ఇమామ్ హుస్సేన్ అమరత్వానికి ప్రతీకగా షియా సమాజ ముస్లింలు నల్లటి వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. వారి కుటుంబీకులు ఓ వైపు రుధిర తర్పణ చేస్తుంటే మహిళలు, చిన్నారులు సైతం శోక గీతాలకు అనుగుణంగా మాతం చేస్తూ భక్తిని చాటు కున్నారు. మసీదుల్లో, కోనేరు సెంటర్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలే కాకుండా పలు రాజకీయ పార్టీల నేతలు ఇతర మతాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లింలకు నేతలు, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, నిమ్మరసం, తాగునీరు పంపిణీ చేసి మతసామరస్యాన్ని చాటారు.
అలీనఖీపాలెంలో
పమడిముక్కల: మొహర్రం సందర్బంగా అలీనఖీపాలెంలోని రెండు మసీదుల్లో వేర్వేరుగా షియా ముస్లింలు చెస్ట్బీటింగ్ చేశారు. రక్తం చిందించి కర్బలా అమర అమరవీరులకు నివాళుల ర్పించారు. తొలుత గ్రామంలో పీర్లను ఊరేగించి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరంకిలాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు.
మొహర్రం సందర్భంగా
ముస్లింల చెస్ట్ బీటింగ్


