భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రాల మధ్య విపత్తు సంసిద్ధత, పరస్పర సమన్వయం, అత్యవసర ప్రతిస్పందన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీఎస్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామంలో అంతర్ రాష్ట్ర మాక్ ఎక్సర్సైజ్–2026 జరిగింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విద్యుత్, మత్స్య, పశుసంవర్ధక, నీటిపారుదల, పంచా యతీరాజ్ శాఖలు పాల్గొన్నాయి. వరద పరిస్థితుల్లో నిర్వహించాల్సిన శోధన, రక్షణ చర్యలు, ప్రభావిత ప్రాంత ప్రజల తరలింపు, వైద్య సహాయం, సహాయక శిబిరాల నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థల సమన్వయం ఈ విన్యాసాలలో ప్రదర్శించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవిస్తున్న నేపథ్యంలో ఇటువంటి మాక్ ఎక్సర్సైజ్లు విపత్తు సంసిద్ధతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక విలువల వినియోగం, సమర్థమైన సమన్వయ వ్యవస్థలు, ముందస్తు సంసిద్ధత చర్యల ద్వారా ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉందని అధికారులు పున రుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఏపీఎస్పీ బెటాలియన్స్/ఏపీఎస్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. రాజకుమారి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్నకుమార్ సహకారంతో ఏపీఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మార్గదర్శకత్వంలో ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్)ఎన్.మధుసూదనరెడ్డి, డీఐజీపీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, డీఐజీపీ (ఏపీ ఎస్పీ బెటాలియన్స్) డి.ఉదయ్ భాస్కర్, ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రకర్జైన్, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, మచిలీపట్నం ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సమన్వయంతో దక్షిణ ప్రాంత సంయుక్త విపత్తు నిర్వహణ విన్యాసం విజయవంతంగా ముగిసింది.
పాలకాయతిప్పలో దక్షిణ ప్రాంత
సంయుక్త విపత్తు నిర్వహణ విన్యాసం
పర్యవేక్షించిన ఏపీఎస్డీఆర్ఎఫ్
ఉన్నతాధికారులు
పాల్గొన్న ఆరు రాష్ట్రాల అధికారులు


