గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): పశుగ్రాస కొరతను అధిగమించేందుకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానాన్ని అనుసరించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ బుధవారం పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి పీఎండీఎస్కు సంబంధించి అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎండీఎస్ విధానంలో వర్షాలు రాకముందు పొడి భూమిలో విత్తనాలు వేసి తక్కువ తేమను వినియోగించుకొని మొలకెత్తేలా చేయడమని.. ఈ విధానంలో భూమి ఖాళీగా ఉండదని, పచ్చదనం, జీవంతో నిండిన నేల రైతులకు క్రమంగా ఆదాయం వచ్చేలా చేస్తుందని వివరించారు. ఈ విధానం వల్ల తేమ నిల్వతో పాటు నేలసారం పెరుగుతుందని, రైతుకు అధిక ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. పశుగ్రాసాల సాగు, పాల ఉత్పత్తి పెరుగుదల, స్వల్పకాలిక మిశ్రమ పంటలు వల్ల చీడపీడల ప్రభావం తగ్గుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి.. ఎల్నినో ఇబ్బందులను అధిగమిద్దామని సూచించారు. రైతులు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పంటలపై అవగాహన పెంపొందించుకొని, పీఎండీఎస్ కోసం సరైన పంటలను ఎంపిక చేసుకోవాలని, తద్వారా అధిక ప్రయోజనాలు పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక అధికారి డా. ఎం.హనుమంతరావు, ఏడీ డా. సునంద, పశువైద్యులు డాక్టర్ మనోజ్, డాక్టర్ పంకజ్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ


