ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జూలై 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. 27న ఆకుకూరలు, 28న కాయగూరలు, 29వ తేదీన కాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. శాకంబరీ ఉత్సవాలలో భాగంగా శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాల్లో దేవతా మూర్తులను ఆకుకూరలు, కాయగూరలతో విశేషంగా అలంకరిస్తారు. అమ్మవారిని అలంకరించేందుకు అవసరమైన పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను రైతులు, హోల్సేల్ వ్యాపారుల నుంచి సేకరించనున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 20 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను దాతల ద్వారా సేకరించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
కదంబం.. ప్రత్యేకం..
శాకంబరీదేవిగా దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ఈ ఉత్సవాలలోనే ప్రత్యేకంగా తయారు చేసే కదంబ ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంది. శాకంబరీదేవి ఉత్సవాలలో రోజూ 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా వీలుగా ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు, అర్చకులు, వైదిక కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సూచించారు.
దుర్గమ్మ సన్నిధిలో
మూడు రోజుల పాటు ఉత్సవం


