ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. మరో వైపున ఆదిదంపతులకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు పాల్గొన్నారు. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ క్యూలైన్లలో భక్తుల తాకిడి కనిపించింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరో వైపున అంతరాలయ రద్దీ తగ్గడంతో రూ. 300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. సర్వ దర్శనం క్యూలైన్లో ఉన్న భక్తులకు రూ. 100 క్యూలైన్లోకి ఉచితంగా అనుమతించారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు రద్దీ తగ్గుముఖం పట్టింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ భక్తిశ్రద్ధలతో జరిగింది. సూర్యభగవానుడి విగ్రహానికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.


