మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన అవసరం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మందుల వినియోగంపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం వినియోగదారులు మందులు కొనుగోలు చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, యాంటీబయోటిక్స్ సరైన వినియోగం, నాణ్యమైన జనరిక్ ఔషధాల ప్రోత్సాహం వంటి అంశాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుల సూచన లేకుండా యాంటీబయోటిక్స్ను వినియోగించడం వలన యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పోస్టర్లలో లైసెన్సు కలిగిన మెడికల్ షాపుల నుంచే మందులు కొనుగోలు చేయడం, తప్పనిసరిగా బిల్ తీసుకోవడం, మందుల గడువు తేదీ పరిశీలించడం, స్వయంగా మందులు వాడకూడదని, వైద్యులు సూచించిన విధంగా పూర్తిగా కోర్సు పూర్తి చేయాలని సూచనలు ఇచ్చామన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ అమ్మకాన్ని నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నాణ్యత, భద్రత, ప్రమాణాలు పాటించే జనరిక్ ఔషధాల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. తక్కువ ఖర్చుతో సమర్థమైన చికిత్స అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని పోస్టర్ల ద్వారా తెలియజేశారన్నారు. కార్యక్రమంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.శ్రీరామమూర్తి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కె.వి.భూపేష్, బి.గోపాలకృష్ణ, జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి డి.వి.ఆర్.సాయి కుమార్, ఉపాధ్యక్షుడు కె.సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
7న విజయవాడలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవం
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వచ్చే నెల 7వ తేదీన విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఏపీ జేఏసీ, అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ గవర్నర్పేటలోని ఏపీ ఆర్ఎస్ఏ భవన్లో బుధవారం వేడుకలకు సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా దినోత్సవానికి మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉన్న హెడ్ ఆఫీసుల్లో (ప్రధాన శాఖాధిపతి కార్యాలయాలు), విజయవాడలోని అన్ని జిల్లా స్థాయి కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులంతా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మహిళా విభాగం చైర్పర్సన్ పారె లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళా దినోత్సవం అనేది కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా మహిళల హక్కులు, సమానత్వం, భద్రత, గౌరవం వంటి అంశాలపై సమాజంలో చైతన్యం కలిగించే ఉద్యమ దినమని అన్నారు. మహిళలు విద్య, ఉపాధి, నాయకత్వం వంటి రంగాల్లో ముందుకు రావాలంటే ప్రభుత్వ విధానాలు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మహిళల ఐక్యత అవసరమని తెలిపారు. వేడుకల సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ నాయకులు పలిశెట్టి దామోదరరావు, తిమ్మసర్తి నాగేశ్వరరావు, రామిశెట్టి వెంకట రాజేష్, ఎ.అర్లయ్య, మందపాటి శంకరరావు, బత్తిన రామకృష్ట పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా సీతా నగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూనీళా సమేత వైకుంఠనాథ్ పెరుమాళ్, శ్రీలక్ష్మీ హయగ్రీవ స్వామి, శ్రీ యోగాంజేయ స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. బుధవారం ఉదయం శ్రీ నారసింహ హవనం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి మంగళ శాసనాలు అందుకున్నారన్నారు.
మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన అవసరం


