ఆర్టీసీ చలో వైజాగ్‌..జనాలకు మొదలైన ప్రయాణ పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ చలో వైజాగ్‌..జనాలకు మొదలైన ప్రయాణ పాట్లు

Jun 20 2025 5:22 AM | Updated on Jun 20 2025 8:58 AM

-

విశాఖలో యోగా కార్యక్రమానికి భారీగా బస్సుల కేటాయింపు

గురువారం మధ్యాహ్నం నుంచే ఏర్పాట్లు షురూ

తీవ్ర ఇబ్బందులు పడ్డ విద్యార్థులు, ప్రయాణికులు

మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి

ఆటోనగర్‌(విజయవాడతూర్పు): విశాఖలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా కార్యక్రమానికి విజయవాడ నుంచి అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులను కేటాయించారు. దీని ద్వారా జనాన్ని తరలించే దిశగా ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం నుంచి సిటీ బస్సుల సంఖ్యను తగ్గించారు. దీని వల్ల విజయవాడ చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. ఇక విద్యార్థులు వారి వారి గ్రామాలకు వెళ్లాలంటే సిటీ బస్సుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. గంటల తరబడి నగరంలోని వివిధ బస్‌ స్టాప్‌ల వద్ద కాలయాపన చేయాల్సి వచ్చింది.

రోజుకు 200 సర్వీసులకు పైగానే..

నిత్యం విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు సుమారు 200 సిటీ సర్వీస్‌లను సంబంధిత ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. గురువారం మాత్రం చాలా తక్కువగా సిటీ బస్‌లను నడిపారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్‌లను కొన్ని సుదూర ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారు. ముఖ్యంగా భీమవరం, మచిలీపట్నం. గుడివాడ, కై కలూరుతో పాటు కొన్ని కీలక ప్రాంతాలకు మాత్రమే ఎక్స్‌ప్రెస్‌లు ఒకటి, రెండు సర్వీస్‌ల చొప్పున మాత్రమే నడిపినట్టు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు.

బస్సుకు ఒక్కడే డ్రైవర్‌..

సిటీ బస్సులను విశాఖపట్నంకు అధిక సంఖ్యలో పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బస్సుకు కేవలం ఒకే డ్రైవర్‌ను కేటాయించారు. రానూపోను ఆ డ్రైవర్‌ మాత్రమే బస్సును నడపాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు. దీని వల్ల డ్రైవర్‌కు రెస్ట్‌ ఉండదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఆటోనగర్‌ సిటీ టెర్మినల్‌ బస్‌స్టేషన్‌ వద్ద సిటీ బస్‌లలో వివిధ గ్రామాలకు సిటీ బస్సులకు వెళ్లేందుకు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు.

మూడు రోజులు తప్పదు..

విశాఖపట్నంలో శనివారం అంతర్జాతీయ యోగా కార్యక్రమం జరగనుంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారిని విశాఖ తీసుకెళ్లేందుకు గాను ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన సిటీ బస్‌ సర్వీస్‌లను చాలా కుదించేశారు. దీంతో ప్రయాణికులు.. బస్‌పాస్‌ల ద్వారా వేరే గ్రామాల నుంచి వెళ్లాల్సిన విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. మూడు రోజుల పాటు విద్యార్థులకు.. ప్రయాణికులకు తిప్పలు తప్పవని ఆర్టీసీ సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement