
ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాలువలు, చెరువుల వెంబడి ఆక్రమణలను గుర్తించి, తొలగించేందుకు కార్యాచరణ రూపొందించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్, జిల్లా వాచ్డాగ్ కమిటీ కన్వీనర్ ఎస్.ఇలక్కియ కమిటీ సభ్యులతో గురువారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జీవో 386 ద్వారా నీటి వనరులు, చెరువుల బెడ్లను ఆక్రమణల నుంచి రక్షించేందుకు జిల్లా స్థాయి వాచ్డాగ్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ ప్రతి నీటి వనరు, చెరువు బెడ్ల పరిస్థితిని సమీక్షించి, ప్రభుత్వానికి త్రైమాసిక నివేదిక సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలోని కాలువలు, చెరువులు వెంబడి ఆక్రమణల ద్వారా ఏర్పాటుచేసుకున్న శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను గుర్తించి జాబితా రూపొందించాలని ఆదేశించారు. ప్రతినెలా నిర్ణీత సమయంలో కమిటీ సమావేశమై ఆక్రమణలను గుర్తించడంతో పాటు తొలగించేందుకు కార్యాచరణ చేపట్టాల్సిందిగా తాజా సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వు ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపైనా కమిటీ చర్చించింది. ఈ సమావేశంలో విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు, ప్రజారోగ్య ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్
ఎస్.ఇలక్కియ