వైద్య రంగం నిర్వీర్యం.. | - | Sakshi
Sakshi News home page

వైద్య రంగం నిర్వీర్యం..

Jun 20 2025 5:22 AM | Updated on Jun 20 2025 5:22 AM

వైద్య

వైద్య రంగం నిర్వీర్యం..

● ప్రసాదంపాడుకు చెందిన 55 ఏళ్ల శ్రీరామ్‌ గురువారం ఉదయం పొట్ట ఉబ్బరంగా ఉండటంతో రామవరప్పాడులోని వెల్‌నెస్‌ సెంటర్‌కు వెళ్లాడు. గ్యాస్‌కు ప్యాన్‌టాప్‌ ఉంటే ఇవ్వమని అక్కడ సిబ్బందిని అడగ్గా, గ్యాస్‌ బిళ్లలు లేవని చెప్పడంతో సమీపంలోని మందుల షాపునకు వెళ్లి రూ.100 పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది.

● ఎనికేపాడుకు చెందిన శ్రీనివాసరావు సమీపంలోని ఓ వెల్‌నెస్‌ కేంద్రానికి వెళ్లి జలుబుగా ఉందని సిట్రజన్‌ టాబ్లెట్స్‌ ఉంటే ఇవ్వమని అడిగాడు.. అవి మా వద్ద లేవని అక్కడి సిబ్బంది సమాధానం ఇచ్చారు. రక్తం పలుచపడే బిళ్లలు ఉంటే ఇవ్వమని అడగ్గా అవికూడా అయిపోయాయని చెప్పడంతో బయటకు వచ్చి ప్రైవేటు షాపులో కొనుక్కున్నారు.

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని పేద రోగులకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు.. ఇలా వారిని తిప్పి పంపి, ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

లబ్బీపేట(విజయవాడతూర్పు): గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యంతో పాటు, అత్యవసర సమయంలో తక్షణ వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హెల్త్‌ వెల్‌ నెస్‌ సెంటర్‌(విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌)లు అలంకార ప్రాయంగా మారాయి. వాటిలో ఉండాల్సిన కనీస మందులు అందుబాటులో ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేయడంతో రోజు రోజుకు సేవలు దిగజారుతున్నాయి. ఆ సెంటర్‌ల ఏర్పాటులో ఉన్న ఉన్నత లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. దీంతో కృష్ణాజిల్లాలో 357, ఎన్టీఆర్‌ జిల్లాలోని 257 వెల్‌నెస్‌ సెంటర్‌లు నిరుపయోగంగా మారాయి. అంతేకాదు గత ప్రభుత్వం నిర్మించిన అత్యాధునిక భవనాలు సైతం నేడు రోగులు లేక వెలవెలబోతున్నాయి.

ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు..

గ్రామీణ ప్రజలకు తక్షణ వైద్యం అందించాలనే లక్ష్యంగా ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఒక వెల్‌నెస్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. వాటిలో బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారిని కమ్యునిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌ఓ)లుగా నియమించారు. అక్కడే గర్భిణులు, చిన్నారులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించేవారు. అంతేకాక దీర్ఘకాలిక రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అక్కడ అందుబాటులో ఉండేవి. పాముకాటు, పాయిజన్‌ వంటి కేసులకు అందించాల్సిన సత్వర చికిత్సలపై సైతం సీహెచ్‌ఓలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమం సైతం వెల్‌నెస్‌ సెంటర్‌ కేంద్రంగానే శిబిరాలు జరిగేవి. దీంతో ఆ సెంటర్‌లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. అంతేకాదు ఏదైనా ఆరోగ్య సమస్యతో వచ్చిన వారికి టెలీ మెడిసిన్‌ విధానంలో నిపుణులైన వైద్యులను స్పందించి మందులు ఇచ్చేవారు. నేడు ఆ పరిస్థితులు లేవు.

అలంకార ప్రాయంగా..

నేడు వెల్‌నెస్‌ కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి. గ్యాస్‌ ట్రబుల్‌కు వాడే ప్యాన్‌టాప్‌, ఎలర్జీలకు వాడే సిట్రజన్‌, దీర్ఘకాలిక రోగులు రక్తం పల్చబడేందుకు వాడే ఏస్పరిన్‌ వంటి మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు. వీటితో పాటు రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడేవారు మందులు లేకపోవడంతో దూర ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పెద్దాస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. గతంలో పదిహేను రోజులకు ఒకసారి నిర్వహించే ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమంలో అన్ని రకాల మందులు ఇచ్చేవారంటూ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ శిబిరాలను సైతం ఎత్తేశారని వాపోతున్నారు.

రాష్ట్రంలో వైద్య రంగం నిర్వీర్యమైంది. ప్రభుత్వాస్పత్రిలో కనీస మందు లు కూడా ఉండటం లేదు. గత ప్రభుత్వంలో వెల్‌నెస్‌ కేంద్రాల్లో అన్ని రకాల సేవలు అందించే వారు. మందులు కూడా ఉండేవి. కూటమి ప్రభుత్వం వాటిని అలంకార ప్రాయంగా మార్చింది. పేదలకు నాణ్యమైన సేవలు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది.

– డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, రాష్ట్ర

ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం

అలంకారప్రాయంగా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు

కనీస మందులు కూడా లేవు

దీర్ఘకాలిక రోగుల ఇక్కట్లు

కూటమి ప్రభుత్వ వైఫల్యంతో

దిగజారిన సేవలు

వైద్య రంగం నిర్వీర్యం.. 1
1/1

వైద్య రంగం నిర్వీర్యం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement