
పండుగలా యోగా డే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈనెల 21వ తేదీ శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగాపై గురువారం నగరంలోని కలెక్టరేట్ నుంచి మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగాలో పాల్గొంటారన్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద ఐదు లక్షల మంది యోగా వేడుకలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్ర బాబు నాయుడు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి.. జిల్లాలోని 605 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9 లక్షల మంది వీక్షిస్తూ యోగా చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన ప్రతి ఒక్కరూ యోగాలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీపీఓ పి. లావణ్య కుమారి, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
● రేపు 9లక్షల మందితో యోగాసనాలు
● కలెక్టర్ లక్ష్మీశ