
క్లోక్రూంలో అనుమానిత బ్యాగును గుర్తించిన రైల్వే జాగిలం
రూ.9.70 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు లభ్యం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్లోని క్లోక్ రూంలో అనుమానాస్పదంగా ఉంచిన బ్యాగును రైల్వే జాగిలం గుర్తించింది. పోలీసులు ఆ బ్యాగును తెరచి చూడగా డబ్బు, బంగారు, వెండి ఆభరణాలు కనిపించాయి. వాటి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.వి.రమణ, ఆర్పీఎఫ్ సీఐ ఆలీబేగ్ ఆధ్వర్యంలో సిబ్బంది విజయవాడ రైల్వే స్టేషన్లో మంగళవారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రైల్వే జాగిలంతో కలసి ఒకటో నంబర్ ప్లాట్ఫాంలోని క్లోక్రూంలో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఒక బ్యాగును జాగిలం గుర్తించింది. మధ్యవర్తుల సమక్షంలో పోలీసులు ఆ బ్యాగును తెరచి చూడగా అందులో రూ.9.70 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు కనిపించాయి. నకిలీ పేరు, అడ్రస్తో ఈ నెల పదో తేదీన ఓ వ్యక్తి ఈ బ్యాగును క్లోక్ రూమ్లో ఉంచాడని గుర్తించారు. నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

క్లోక్రూంలో అనుమానిత బ్యాగును గుర్తించిన రైల్వే జాగిలం