● సీపీ సాయిచైతన్య
● కేంద్ర కారాగారం భద్రత పరిశీలన
నిజామాబాద్ అర్బన్: కేంద్ర కారాగారం అత్యంత కీలకమైన భద్రతా ప్రదేశమని, ఇక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. నిజామాబాద్ కేంద్ర కారాగారంలో భద్రతా ఏర్పాట్లపై సోమవారం నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కారాగారంలోని భద్రతాను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా విధానాలు, బందోబస్తు నిర్వహణ, సిబ్బంది విధుల కేటాయింపు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు తదితర వివరాలను అధికారులతో మా ట్లాడి తెలుసుకున్నారు. జైలులోని ఆస్పత్రి, డీ–అడిక్షన్ సెంటర్లను పరిశీలించి, ఖైదీలకు అందుతున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. జైలు అధి కారులు, పోలీస్శాఖ, భద్రతా సిబ్బంది సమన్వ యంతో పనిచేస్తే భద్రతను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. జైలు సూపరింటెండెంట్ అశోక్కుమార్, డిప్యూటీ జైలర్ మన్మథ రావు, జైలర్లు తిరుమలరెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) ధరణికుమార్, మెడికల్ ఆఫీసర్ సామ్రాట్ ఆరో టౌన్ ఎస్సై సందీప్ పాల్గొన్నారు.
అనాథ మృతుల ఆత్మశాంతి కోసం..
జీవిత చివరి మజిలీలో నా అనేవారు లేక కన్నుమూసిన అనాథలకు ‘ఇందూరు యువత’ అంతిమ సంస్కారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అనాథలకు అంతిమ సంస్కారాలు పూర్తిచేసి అక్కడితో వదిలేయకుండా.. జీవికి మోక్ష నగరి అయిన కాశీకి చితాభస్మాన్ని తీసుకెళ్లి పవిత్ర గంగా నదిలో కలిపారు. మణికర్ణికా ఘాట్లో సోమవారం పిండ ప్రదానం చేశారు. సామాజిక సేవలో ముందుటున్న ‘ఇందూరు యువత’ ప్రతి అడుగులో తన బాధ్యతను పక్కాగా నిర్వర్తిస్తూ మానవత్వాన్ని చాటుతోంది. – నిజామాబాద్ రూరల్
పంటల వివరాలతో స్పష్టత
డిజిటల్ సాంకేతికను వినియోగించి రైతులు ప్రతి సీజన్లో సాగు చేస్తున్న పంటల వివరాల్లో స్పష్టత తీసుకు వచ్చేందుకు పారదర్శకంగా సర్వే నిర్వహిస్తున్నారు. దీంతో పంటల వాస్తవ పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లభిస్తుంది. జియో ట్యాగింగ్ ద్వారా పంటల లెక్కలను పక్కాగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి సర్వే పనులను చేపట్టగా రెండు రోజులుగా ఊపందుకుంది.


