డిచ్పల్లి: పంట మార్పిడి విధానం పాటించడం ద్వారా రైతులు సుస్థిర ఆదాయం సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రుద్రూర్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త వైఎస్ పరమేశ్వరి సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మండలంలోని మండలం మెంట్రాజ్పల్లిలో మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు వైఎస్ పరమేశ్వరి, డాక్టర్ రమేశ్ మాట్లాడుతూ.. ఒకే పంటను వరుసగా సాగు చేయడం వల్ల నేలసారం తగ్గుతుందని, పంట మార్పిడి విధానం అనుసరించడం ద్వారా నేలలో పోషకాల సమతుల్యత నిలబడుతుందన్నారు. ఎరువుల వినియోగం తగ్గి పంట దిగుబడి పెరుగుతుందన్నారు. తమ భూమి పరిస్థితులు, నీటి లభ్యత, మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరైన పంట మార్పిడి పద్ధతిని అనుసరించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రమేశ్, ఏఈవో వంశీకృష్ణ, రైతులు పాల్గొన్నారు.


