● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి
● కలెక్టర్తో కలిసి ఘాట్ల సందర్శన
రెంజల్(బోధన్): గోదావరి పుష్కరాల్లో (2027) కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. ఇలా త్రిపాఠితో కలిసి శనివారం కందకుర్తి పుష్కరక్షేత్రాన్ని సుదర్శన్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రివేణి సంగమ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుందని, వారి అవసరాలకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా ఒక్క రోజే కందకుర్తికి సుమారు 6 లక్షల మంది వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రాద్ధా మండపం, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్, వీఐపీ ఘాట్ల నిర్మాణం, రొడ్ల మరమ్మతులు తదితర పనులను గుర్తించి అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇటీవల గోదావరి పుష్కరాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రెండు, మూడు నదులు కలిసే ప్రాంతాల కు ఉన్న ప్రాధాన్యతను సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా వివరించారని గుర్తుచేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోబీన్ఖాన్, మాజీ జెడ్పీటీసీ నాగభూషణంరెడ్డి సర్పంచ్లు గయాసుద్దీన్, ధనుంజయ్, మల్లేశ్, భానుచందర్, అశోక్నాయక్, జుబేర్లతోపాటు నాయకులు పాల్గొన్నారు.
తోఫాల పంపిణీ
రంజాన్ను పురస్కరించుకుని మండలంలోని ముస్లిం మైనారిటీలకు మంజూరైన తోఫాలను స్థానిక తహసీల్ కార్యాలయంలో సుదర్శన్రెడ్డి పంపిణీ చేశారు. మండలంలో 300 మందికి ప్రభుత్వం కానుకలను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్మహతో, తహసీల్దార్ శ్రావణ్కుమార్, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాయారెడ్డి పాల్గొన్నారు.


