ధర్పల్లి: మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్లో సీఐ భిక్షపతి ఎస్సై శ్రీనివాస్తో కలిసి కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. మండలంలోని చత్రు తండాకు చెందిన జారుపాల కాంతి(50) అనే మహిళకు ధర్పల్లికి చెందిన గుండ్ల నర్సయ్యకు పరిచయం ఉంది.
గత బుధవారం డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్న నర్సయ్య నైలాన్ తాడుతో ఆమె మెడకు గట్టిగా చుట్టి హత్య చేశాడు. ఆమె మృతి చెందిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు తన షెడ్డులో మృతదేహాన్ని ఉంచాడు. రాత్రి ఎర్రని బట్టతో చుట్టి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఊరు బయటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో వాహనం అదుపుతప్పింది. మృతదేహం కింద పడిపోవడంతో ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో వాహనాన్ని, మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. విచారణలో నిందితుడు నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.


