బాన్సువాడ రూరల్: మండలంలోని తాడ్కోల్ గ్రామానికి చెందిన గూడెంల సాయిలు అనే వ్యక్తి అదృశ్యమైనట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు. ఈ నెల 11న చేపలు పట్టేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి తిరిగి రాలేదని పేర్కొన్నారు. సాయిలు కుటుంబసభ్యులు గురువారం ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో తెల్లని ధోవతి, తెలుపురంగు చొక్కా ధరించి ఉన్నాడని, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు.
నవీపేట: మండలంలోని అబ్బాపూర్ (ఎం) గ్రామా నికి చెందిన ప్రేమజంట గురువారం పోలీసులను ఆశ్రయించింది. ఒకే కులానికి చెందిన డొక్కలి వినీత్కుమార్, బట్టు శైలజ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పడంతో నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ రామాలయంలో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కల్పించాలని ఎస్సై శ్రీకాంత్ను ఆశ్రయించగా ఇరువురి తల్లిదండ్రులు స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
సిరికొండ: చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారని ఎస్సై రామకృష్ణ గురువారం తెలిపారు. మెట్టుమర్రి తండాలో 2019లో చోరీ జరగగా, నిందితుడు కేతావత్ రవిపై కేసు నమోదైనట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసును విచారించిన ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తి భవ్యశ్రీ నిందితుడు రవికి ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ లీగల్: ఇద్దరు వ్యక్తులపై హత్యకు యత్నించిన నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ తీర్పునిచ్చారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ లక్ష్మినర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం..రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామంలో 30 ఆగస్టు, 2020న షేక్ షాదుల్లా, సుల్తాన్ ఖాన్లపై ఆనంద్ శర్మ అనే నిందితుడు కర్రతో దాడి చేశాడు. దాడిలో షాదుల్లా, సుల్తాన్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల స్నేహితుడు షేక్ లాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో నిజామాబాద్ రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
సదాశివనగర్(ఎల్లారెడ్డి):మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఓ పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. గ్రామంలోని సున్న పు రాజు నివాసపు ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకు న్న ఎస్సై పుష్పరాజ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.


