నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలం నర్సింగ్పల్లి శివారులోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఇందూర్ తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు బుధవారం ఉదయం ఆలయంలో ‘సర్వ రక్షా కర సుదర్శన నారసింహ హవనం‘ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా దేవనాథ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు. సర్వ లోకాలను ఏలే మహావిష్ణువు దర్శనం కావాలంటే సుదర్శన భగవానుడి అనుగ్రహం కావాలి, ఆ సుదర్శన భగవానుడి అనుగ్రహం కోసం సర్వా రక్షాకర సుదర్శన నారసింహ హోమం ఉత్తమ మార్గమని అన్నారు. సాయంత్రం స్వామివారు హంస వాహనంపై దర్శనం ఇచ్చారు. ఆలయ ధర్మకర్తలు ప్రముఖ సినీ నిర్మాత సోదరులు దిల్ రాజు, శిరీష్ రెడ్డి దంపతులు, ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు, విజయసింహారెడ్డి దంపతులు, దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్, శైలేష్ కొలను, ఛాయాగ్రహకులు విజయ చక్రవర్తి, సినీ నిర్మాతలు కృష్ణ, సత్యనారాయణ రెడ్డి మహేందర్, మాజీ ఎంపీటీసీ రాములు రాజేశ్వర్, నరాల సుధాకర్, సాయిలు పాల్గొన్నారు.


