● సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు
● వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
నిజామాబాద్ అర్బన్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు , 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యాచరణపై సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ఈనెల 12వ తేదీన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో సీఎస్ మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని సీఎం రేవంత్రెడ్డి పదే పదే ఉటంకిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు ఏవిధంగానైతే ప్రామాణికమైన ఫలితాలు అందుతాయో, ఆ కోణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్య, వైద్యం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ఉండాలన్నారు.
శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం ఆహ్వానించాలని సూచించారు. జిల్లాలోని వివిధ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపేలా ఫొటో ప్రదర్శనను వేదిక వద్ద ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా ఎన్నికై న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.
ఇన్చార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో, గ్రామ పంచాయతీల సర్పంచ్లకు మరో వేదికపై మాస్టర్ ట్రైనర్లతో నిర్దేశిత అంశాలపై శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని అన్నారు. వీసీ లో డీపీవో శ్రీనివాస్రావు, సీపీ వో రతన్, మున్సిపల్ కమిషనర్లు జాదవ్కృష్ణ, ఉమామహేశ్వర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


