నిజామాబాద్ అర్బన్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో రూ. 75 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ చేశారు. ఇటీవల మరణించిన రెవెన్యూ ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ కుటుంబానికి చెక్కును అందజేశారు. ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా జిల్లా రెవెన్యూ ఉద్యోగులకు బీమా చేయించినట్లు సంఘం అధ్యక్షుడు రామన్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సేవా సంస్థ (హెల్పింగ్ ఆర్ట్స్) ఆధ్వర్యంలో డెంటల్ విద్యార్థి ఓంకార్కు రూ. 25 వేల ఆర్థిక సహాయం చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామన్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రెవెన్యూ ఉద్యోగులకు బీమా చేయించడం ద్వారా అత్యవసర సమయాల్లో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమానికి హాజరైన పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ గుండెకాయలాంటిదని అన్నారు. ప్రభుత్వ విజయాలకు రెవెన్యూ శాఖ కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాజకుమార్, రామకృష్ణారెడ్డి, నగర మేయర్ ఉమారాణి , నుడా చైర్మన్ కేశ వేణు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ప్రశాంత్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


