● లారీ పశువుల పేడ ధర రూ.3 వేల
నుంచి రూ.4 వేలు పెరుగుదల
మోర్తాడ్(బాల్కొండ): పసుపు సాగు చేసే వ్యవసాయ క్షేత్రాల్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పేడను రైతులు విరివిగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పసుపు తవ్వకాలు చివరి దశకు చేరుకోవడంతో రైతులు ముందస్తుగా పశువుల పేడను పొలాల వద్ద నిలువ చేసుకుంటున్నారు. అయితే, నెల రోజుల వ్యవధిలోనే ఒక్కో లారీ లోడ్కు రూ.3వేల నుంచి రూ.4 వేల ధర పెరిగింది. పశువుల పేడ లారీ లోడ్కు రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉంటే ప్రస్తుతం రూ.26 వేల నుంచి రూ.29 వేలకు చేరింది. గొర్రెలు, మేకల పేడ ధర నెల రోజుల క్రితం రూ.34 వేల నుంచి రూ.35 వేల ధర పలికితే ఇప్పుడు రూ.37 వేల నుంచి రూ.39 వేలకు ధర పెరిగింది. గడచిన సీజన్లో పసుపు పంటకు క్వింటాలుకు రూ.10 వేలకు మించి ధర లభించడంతోనే సేంద్రియ ఎరువుల ధర విపరీతంగా పెంచారని రైతులు అంటున్నారు. పశువుల పేడను యజమానులు నేరుగా విక్రయిస్తే ధర ఇలా ఉండదని, దళారుల జోక్యంతోనే ధర భారీగా పెరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా, రైతులు వర్మి కంపోస్టును వినియోగించడం మొదలుపెడితే పశువుల పేడ ధర తగ్గే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. వర్మి కంపోస్టును గ్రామ పంచాయతీల ద్వారా ఉత్పత్తి చేయాలని నిర్ణయించినా ఆశించినంత స్థాయిలో ఉత్పత్తి సాగడం లేదు. ప్రైవేటు కంపెనీలు విక్రయించే ఎరువు ధర కొంత ఎక్కువగానే ఉంది.


