ఖలీల్వాడి: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సోమవారం మొదటి సంవత్సరం భౌతిక, అర్థశాస్త్రంతోపాటు ఒకేషనల్ పరీక్ష జరిగినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.
మొత్తం 20,413 మంది విద్యార్థులకు గాను19,737 (96.7శాతం) మంది హాజరుకాగా, 676 మంది గైర్హాజరయ్యారని వివరించారు. 55 పరీక్షాకేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఐఈవో తెలిపారు.
ఈవీఎం గోడౌన్ పరిశీలన
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్లో ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోదాము సీల్ను తెరిపించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. గోదాము వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు నిరంతరం పని చేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామగ్రికి నష్టం వాటిల్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజేందర్ తదితరులు ఉన్నారు.
నేడు జాబ్ మేళా
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లో ఉన్న ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం వరకు హాజరు కావాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యసించిన వారు అర్హులని, ఇతర వివరాలకు 89197 43152, 70135 80089 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


