మూడోసారీ మహిళకే మేయర్ పీఠం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మేయర్ పీఠం మీద మూడోసారీ మహిళే కూర్చోనున్నారు. గత రెండు పర్యాయాలు బీసీ మహిళలు ఈ పదవిని నిర్వర్తించారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఇక ఆర్మూరు, భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాలు సైతం జనరల్ మహిళలకే రిజర్వ్ అయ్యాయి. బోధన్ మున్సిపల్ పీఠం జనరల్కు రిజర్వ్ అయింది.
● నిజామాబాద్ మేయర్ సీటు కోసం పోటీ పడేవారి సంఖ్య పెరుగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి మేయర్ రేసులో ఉన్నారు. ఇప్పటికే ఈమె మేయర్ రేసులో ఉన్నట్లు గతం నుంచే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్యెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోడలు డాక్టర్ ధన్పాల్ శ్రీవాణి సైతం మేయర్ పీఠం రేసులోకి రానున్నట్లు తెలుస్తోంది. శ్రీవాణి రేడియాలజిస్టుగా పనిచేస్తున్నారు.
● కాంగ్రెస్ నుంచి డాక్టర్ కవితా రెడ్డి పేరు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆమెకు రాష్ట్ర స్థాయి ’ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్’ చైర్ పర్సన్గా పదవి దక్కనున్నట్లు సమాచారం. దీంతో నల్ల స్రవంతి రెడ్డి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంఏ ఆర్థిక శాస్త్రం చదివిన నల్ల స్రవంతి రెడ్డి భర్త దినేష్ రెడ్డితో కలిసి ఈమె అనేక వ్యాపారాలు నిర్వహిస్తోంది. నల్ల స్రవంతి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండడంతో బాటు ఆర్బీవీఆర్ఆర్ లో చురుకై న సభ్యురాలిగా ఉన్నారు. ఈమెది రాజకీయ కుటుంబ నేపథ్యం. భర్త దినేష్ తాత నిజామాబాద్ మున్సిపల్ మొదటి చైర్మన్ కాగా, ఆమె అత్త డాక్టర్ భారతీరెడ్డి సైతం మున్సిపల్ చైర్ పర్సన్గా చేశారు. మరోవైపు ఈమె అన్న పురన్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కు అత్యంత సన్నిహితుడు.
● మాజీ పబ్లిక్ ప్రాసిక్యుటర్ కాటిపల్లి సరళా మహేందర్ రెడ్డి మేయర్ రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె, ఆమె భర్త మహేందర్ రెడ్డి హైకోర్టు న్యాయవాదులుగా సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే సరళ మహేందర్ రెడ్డిని ఒక జాతీయ పార్టీ సంప్రదించినట్లు చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీలు సైతం మేయర్ అభ్యర్థి విషయంలో లెక్కలు వేసుకుంటున్నాయి.
ఆర్మూరు, భీవ్ుగల్ చైర్పర్సన్ (జనరల్ మహిళ)
మూడోసారీ మహిళకే మేయర్ పీఠం
మూడోసారీ మహిళకే మేయర్ పీఠం


