మద్యం మత్తులో యువకుని వీరంగం
మాచారెడ్డి: మద్యం మత్తులో ఓ యువకుడు దుస్తుల దుకాణంలో వీరంగం సృష్టించిన ఘటన మండలంలోని గజ్యానాయక్ తండాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రునాయక్ తండాకు చెందిన మధు బుధవారం గజ్యనాయక్ తండా చౌరస్తాలో ఉన్న బట్టల దుకాణంలో దుస్తులు కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన దుస్తులకు భారీ డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి షాపులో పనిచేస్తున్న గుమాస్తా కుదరదని చెప్పడంతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇరువురి మధ్య మాటామాట పెరుగడంతో మీ అంతు చూస్తానని బెదిరించి, తన సొంత లారీతో బట్టల దుకాణాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మధును అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
ఐదు ఇళ్లలో చోరీ
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని ముకుంద రెడ్డి కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించి ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎస్సై వెంకట్రావ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందరెడ్డి కాలనీలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన కాసాల జనార్దన్ రెడ్డి ఇంట్లో కొంత నగదు, ఒక బంగారు చైన్, వెండి పూజ సామగ్రి అపహరణకు గురైందని, మిగతా ఇళ్లలో వస్తువులు చోరీకి గురికాలేదని తెలిపారు. బుధవారం చోరీ జరిగిన ప్రదేశాలను బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య సిబ్బందితో కలిసి పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రల నమూనాలను సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ తిరుపయ్య మాట్లాడుతూ పండుగకు వేరే ప్రాంతాలకు వెళ్లే వ్యక్తులు పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ, ఎవరూ సమాచారం ఇవ్వలేదని, సమాచారం ఇస్తే ఆ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచేవారమని పేర్కొన్నారు.
పేకాడుతున్న ఏడుగురి అరెస్టు
రుద్రూర్: కోటగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని పోతంగల్ మండలం కల్లూర్ గ్రామ శివారులో మంగళవారం అర్ధరాత్రి పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. వారి నుంచి రూ.7,920 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మొరం టిప్పర్ల పట్టివేత
బాన్సువాడ : అక్రమంగా మొరం తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. సింగీతం శివారు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న నాలుగు టిప్పర్లను ప ట్టుకుని సీజ్ చేశామని, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నార. అను మతి లేకుండా మొరం తలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్
నిజాంసాగర్ (జుక్కల్): మండలంలోని మల్లూరు గ్రామంలో ఈ నెల 9న జరిగిన చోరీ కేసులో నిందితురాలు సాయవ్వను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మల్లూరు గ్రామానికి చెందిన పెద్ద రెడ్డి విజయరావు ఇంట్లో బీరువా నుంచి వెండి ఆభరణాలతోపాటు బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. కేసు నమోదు చేసుకొని సాయవ్వపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
మద్యం మత్తులో యువకుని వీరంగం
మద్యం మత్తులో యువకుని వీరంగం


