బల్దియాలో అధికారుల కొరత | - | Sakshi
Sakshi News home page

బల్దియాలో అధికారుల కొరత

Jun 27 2025 4:14 AM | Updated on Jun 27 2025 4:14 AM

బల్ది

బల్దియాలో అధికారుల కొరత

నిజామాబాద్‌ సిటీ: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యమైన అధికారులు లేకపోవడంతో పాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో మున్సిపల్‌ కమిషనర్‌పైనే పనిభారం పెరుగుతోంది. ముఖ్యమైన రెవెన్యూ, శానిటేషన్‌ విభాగాలకు హెడ్‌లు లేకపోవడంతో ఆయా విభాగాల పనులు సవ్యంగాసాగడం లేదు.

ఇదీ పరిస్థితి..

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తెలంగాణలోనే మూడో పెద్ద కార్పొరేషన్‌. కార్పొరేషన్‌లో ప్రధాన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్‌ కమిషనర్‌ మినహా మిగతా పెద్ద పోస్టులు భర్తీ కావడం లేదు. అడిషనల్‌ కమిషనర్‌, మున్సిపల్‌ వైద్యాధికారి (ఎంహెచ్‌వో) వంటి ప్రధాన పోస్టులు భర్తీకావడం లేదు. ఇదివరకు డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహించిన రాజేంద్రకుమార్‌ పదవీ విరమణ పొందారు. అడిషనల్‌ కలెక్టర్‌గా పనిచేసిన ఎన్‌ శంకర్‌ జీహెచ్‌ఎంసీకి బదిలీచేయించుకుని వెళ్లిపోయారు. ఎంహెచ్‌వో పోస్టు మాత్రం రెండేళ్లుగా ఖాళీగానే ఉంది.

బోధన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా వి ధులు నిర్వహిస్తున్న జయకుమార్‌ పదోన్నతిపై అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా వచ్చారు. ఆయనకు ఇన్‌చార్జి ఎంహెచ్‌వోగా బాధ్యతలు అప్పజెప్పారు.

కుప్పలు తెప్పలుగా ఫైళ్లు..

అధికారుల కొరతతో బల్దియాలో పనులు ముందుకు కదలడం లేదు. రెవెన్యూ శాఖలో ఫైళ్లు కుప్పలుకుప్పలుగా పడి ఉంటున్నాయి. చిన్న పనుల కోసం సైతం ఆరు నెలలుగా తిరుగుతున్నవారు ఎక్కువగా ఉన్నారు. రెవెన్యూ శాఖలో ఇద్దరు ఆర్‌వోలు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరు పదోన్నతిపై బదిలీపై వెళ్లనున్నారు.

నత్తనడకన పారిశుధ్య పనులు..

పారిశుధ్య విభాగంలో రెండేళ్ల నుంచి ఉన్నతాధికారి లేకపోవడంతో వ్యవస్థ మొత్తం గాడితప్పింది. శానిటరీ జవాన్లపై అజమాయిషీ లేదు. ప్రతీరోజు 100 మంది కార్మికులు గైర్హాజరవుతున్నారు. చెత్త తొలగింపు సరిగ్గా జరగడం లేదు. ప్రధాన రోడ్డులో మాత్రమే శానిటేషన్‌ చేసి ఫొటోలు తీసి కమిషనర్‌కు పంపి మమ అనిపిస్తున్నారు. శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ ఉన్నా ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లదే హవా. వారు చెప్పిందే వేదం అన్నట్లుగా మారింది.

అన్నీ కమిషనరే..

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో చిన్న చితకా మొదలు ఇతర పనులన్నీ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ చేస్తున్నారు. ప్రతీరోజు ఉదయం 6 గంటలకే డివిజన్లలో రెండు గంటలు ఆకస్మిక తనిఖీలు చేసి పారిశుద్య పనులు పర్యవేక్షిస్తున్నారు. రెవె న్యూ, శానిటేషన్‌ పనులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక, రాజీవ్‌ వికాసం వంటి అన్ని పనులు స్వయంగా కమిషనరే చూస్తున్నారు.

కార్పొరేషన్‌లో ముఖ్యమైన

పోస్టులు ఖాళీ

శానిటేషన్‌ అస్తవ్యస్తం

కుంటుపడుతున్న పాలన

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

బల్దియాలోని ఖాళీలపై ఉన్న తాధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అడిషనల్‌ కమిషనర్‌తో పాటు ఎంహెచ్‌వో పోస్టు చాలా ముఖ్యమైనవి. నగరవాసులకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే నా దృష్టికి తీసుకురావాలి. ఉద్యోగులు ప్రతి ఒక్కరు జవాబుదారీగా ఉండాల్సిందే. ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవు.

– దిలీప్‌ కుమార్‌, కమిషనర్‌

బల్దియాలో అధికారుల కొరత 1
1/1

బల్దియాలో అధికారుల కొరత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement