
కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయం
డిచ్పల్లి: అధికార దుర్వినియోగంతో రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతి కేసుల్లో జైలుకెళ్లడం ఖాయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. గురువారం డిచ్పల్లి మండలం నక్కలగుట్ట తండా, దూస్గాం గ్రామాల్లో సుమారు రూ.2కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో వందేళ్ల క్రితం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్, పోచంపాడ్ ప్రాజెక్టులు ఇప్పటికీ అలాగే ఉంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుంగిపోయిందని విమర్శించారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వచ్చే మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలు ఉండకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లనుమంజూరు చేస్తోందని అన్నారు. కోటి మంది మహిళలను స్వయం ఉపాధి ద్వారా కోటీశ్వరులను చేయడానికి కృషి చేస్తోందన్నారు.
జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. బీఆర్ఎస్, బీజేపీ దొందూ దొందేనని విమర్శించారు. అనంతరం మిట్టాపల్లి, లింగసముద్రం గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. అంతకుముందు మండలంలోని యానంపల్లికి చెందిన పలువురు యువకులు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ సతీశ్రెడ్డి, ఎంపీడీవో బుక్య లింగం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రాంచందర్ గౌడ్, డీసీసీ డెలిగేట్స్ వాసుబాబు, శ్యాంసన్, ధర్మాగౌడ్, తండా, గ్రామపెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయం