
ప్రమాదకరంగా లోలెవల్ వంతెన
● నర్సింగ్పల్లి లోలెవల్ వంతెనతో
పొంచి ఉన్న ప్రమాదం
● ఇరుగ్గా ఉండటంతో
వాహనదారులకు తిప్పలు
సిరికొండ: లోలెవల్ వంతెనతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. నర్సింగ్పల్లి వాగుపై ఉన్న వంతెన ఇరుగ్గా ఉండటంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వంతెనపై ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు ఆదమరిస్తే పక్కన ఉన్న వాగులో పడిపోయే అవకాశం నెలకొంది. భీంగల్ నుంచి కామారెడ్డి వైపు, చిన్నవాల్గోట్, సిరికొండ మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్లే మార్గంలో ఈ లోలెవల్ వంతెన ఉంది. ఈ మార్గంలో రోజు వందలాది వాహనాలు నిత్యం నడుస్తుంటాయి. నలభై ఏళ్ల క్రితం ఆనాటి అవసరాలకు అనుగుణంగా అప్పటి రద్దీ మేరకు వాగుపై లోలెవల్ వంతెనను నిర్మించారు. క్రమేణా వాహనాల రద్దీ పెరిగిపోవడంతో వంతెనపై ప్రయాణం గగనంగా మారుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీంగల్, వేల్పూర్ మండలాలకు హైదరాబాద్ వెళ్లేందుకు కామారెడ్డి వద్ద ఉ్న ఎన్హెచ్ 44 చాలా దగ్గరవుతుంది. దూర భారం తగ్గుతుండటం వల్ల ఈ రహదారి వాహనాల రాకపోకలతో చాలా రద్దీగా మారింది. లోలెవల్కు తోడు వంతెన ఇరుగ్గా ఉండటంతో వాహనదారులకు ప్రయాణం ఇబ్బందిగా మారింది. మండల వాసులు ఈ వంతెన మీదుగా భీంగల్, ఆర్మూర్ వైపు నిత్యం వెళ్తుంటారు. వంతెనకు ఇరు వైపులా భద్రత కోసం ఏర్పాటు చేసిన రాతి దిమ్మెలు ధ్వంసమయ్యాయి. రాళ్లు విరిగిపోవడంతో ప్రమాదం అంచున ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. లోలెవల్ వంతెన స్థానంలో భారీ వంతెన నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కొత్త వంతెన నిర్మించాలి
నర్సింగ్పల్లి వద్ద వాగుపై ఉన్న లోలెవల్ వంతెన ప్రమాదకరంగా ఉంది. వంతెన మీదుగా వెళ్తుండగా కొద్దిగా ఆదమర్చినా పక్కన ఉన్న వాగులో పడిపోయే ప్రమాదం నెలకొంది. వంతెన ఇరుగ్గా ఉండటంతో ఇబ్బందిగా మారింది. పాత వంతెన స్థానంలో కొత్త వంతెనను నిర్మించాలి. – రవీందర్గౌడ్, గడ్కోల్

ప్రమాదకరంగా లోలెవల్ వంతెన

ప్రమాదకరంగా లోలెవల్ వంతెన