
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్న నేపథ్యంలో
● ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో
అత్యధికంగా మహిళా ఓటర్లు
● ఇతర జిల్లాలతో పోలిస్తే
ఇక్కడే అధికం
● ప్రతి సెగ్మెంట్లో వారి సంఖ్యే ఎక్కువ
● చట్టసభలోకి వెళ్లనున్న మహిళలు
● నియోజకవర్గాల పునర్విభజనతో మారనున్న ముఖచిత్రం
గత లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల వివరాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి తదుపరి శాసనసభలోకి మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువమంది అడుగు పెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో ఆలస్యమైంది. అయితే 2027లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కల అనంతరం రాష్ట్ర శాసనసభ స్థానాల పునర్విభజన చేపట్టడం ఖాయమైంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఉండనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు వరకు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల సంఖ్య 153కు పెరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలున్నాయి. రాష్ట్రంలో ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో ప్రస్తుతం 7 చొప్పున ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు 9కి పెరగనున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మహిళల జనాభా, ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. రానున్న జనాభా లెక్కింపుతోపాటు ఓట్ల సంఖ్యలోనూ మహిళల ఓట్ల సంఖ్య మరింతగా పెరగనుంది.
ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే మహిళల ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటూ వస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతోపాటు రాష్ట్రపతి ముద్ర వేశారు. దీంతో తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 50గా ఉండనుంది. ఇతర ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచే మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువగా శాసనసభలోకి అడుగు పెట్టనున్నారు. ఇదిలా ఉండగా లోక్సభ సీట్ల పెంపు అంశంపై ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదు. లోక్సభ సీట్ల విషయమై దక్షిణాదికి అన్యాయం చేయొద్దనే వాదన నడుస్తున్న నేపథ్యంలో పెంచుతారా లేదా అనేది నిర్ణయం కాలేదు.
రాచమార్గంగా ఉమ్మడి జిల్లా సెగ్మెంట్లు!
ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ మహబూబ్నగర్ తదితర ఉమ్మడి జిల్లాల్లో ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా గిరిజన రిజర్డ్వ్ సీట్లు ఎక్కువగా కేటాయింపు అవుతుంది. మరికొన్ని జిల్లాల్లో ఎస్సీ రిజర్డ్వ్ సీట్లు కచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న మొత్తం 11 శాసనసభ సెగ్మెంట్లకుగాను జుక్కల్ అసెంబ్లీ సీటు మినహా 10 స్థానాలు జనరల్గానే ఉన్నాయి. అయితే ఈ 11 శాసనసభ సెగ్మెంట్లలో అన్ని స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అత్యధికంగా ఉండడం ప్రత్యేకం. ఈ నేపథ్యంలో ఉ మ్మడి జిల్లా నుంచి మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం గణనీయంగా ఉండనుంది. ఉమ్మడి ని జామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు నిజామాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చే కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లలో సైతం అత్యధికంగా మహిళా ఓటర్లే ఉండడం విశేషం. కా గా నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ వర్గాలతోపాటు ఇతర అన్ని వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో ఓటర్ల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో డీలిమిటేషన్లో నగరాన్ని ఏవిధంగా విభజిస్తారనే దానిపై ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఉత్తర దక్షిణంగా విభజిస్తారా, తూర్పు పడమరగా విభజిస్తారా అనే విషయమై చర్చ జరుగుతోంది. ఏఏ మండలాలు ఏఏ నియోజకవర్గాల్లోకి మారతాయోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.