
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ భారం
ఖలీల్వాడి : ఆర్టీసీ ప్రయాణికులపై టోల్భారం పడింది. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లోని ప్రయాణికులకు రూ.20 నుంచి రూ. 30 వరకు టికెట్ ధరలు పెరిగాయి. నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) టోల్ ట్యాక్స్ పెంచింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ టోల్భారం పడకుండా ఉండేందుకు టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో టోల్ గేటుకు రూ.10 చొప్పున భారం పడుతుంది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు ఇందల్వాయి, భిక్కనూర్, తుప్రాన్ టోల్ప్లాజాలు వస్తాయి. ఈ ప్లాజాను బట్టి ఇక్కడి నుంచి ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ధర రూ.30 పెరిగింది. కామారెడ్డి, బాన్సువాడ నుంచి హైదరాబాద్కు వెళ్లడానికి రెండు టోల్ ప్లాజాలు ఉండగా, ఇక్కడి ప్రయాణికుల టికెట్ ధర రూ.20 పెరుగుతుంది. గతంలో ప్రయాణికులకు చిల్లర ఇవ్వడానికి కండక్టర్లుకు ఇబ్బందులు ఏర్పడటంతో టికెట్ ధరలను రౌండ్ ఫిగర్ చేశారు. దీంతో అప్పుడు రేట్లు పెరిగాయి. మళ్లీ టోల్ప్లాజా రేట్లను ఎన్హెచ్ఏఐ పెంచడంతో ప్రయాణిలకు అవగాహన కల్పించకుండానే ధరలను పెంచేశారు. ఒకేసారి ధరలు పెంచడంతో ప్రయాణికులు నిలదీస్తున్నారు. గతంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు ఏసీ బస్సుల్లో టికెట్ ధర రూ.430 ఉండగా, ప్రస్తుతం రూ. 460కి పెరిగింది. ఎక్స్ప్రెస్, ఎలక్ట్రికల్ బస్సుల్లో రూ. 360 టికెట్ ధర ఉంటే ప్రస్తుతం రూ. 390 ధర నిర్ణయించారు. ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా రేషలైజేషన్ పేరిట అన్ని రకాల ఎక్స్ప్రెస్లపై రూ.10 ధరలు పెంచింది. మహాలక్ష్మి పథకంతో ఎక్స్ప్రెస్ బస్సులలో పురుషులకు సీట్లు దొరకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా తాజాగా టికెట్ ధరలను పెంచడంతో భారం పడుతోంది. టికెట్ ధరల పెంపు విషయమై ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్నను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
నిజామాబాద్ నుంచి
హైదరాబాద్కు రూ.30 పెంపు
ఒక్కో టోల్ గేట్కు
రూ.10 చొప్పున అధిక చార్జీ