
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
సిరికొండ : డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ధర్పల్లి సీఐ భిక్షపతి సూచించారు. మండల కేంద్రంలో యువతతో కలిసి పోలీసులు సామూహిక మార్నింగ్ వాక్, పోలీసు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రతి గల్లీలో మూడు కిలో మీటర్ల మేర మార్నింగ్ వాక్ నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడ్డారు. వాకింగ్లో పాల్గొన్న యువతకు రాగి మాల్ట్ను పంపిణీ చేశారు. సీఐ మాట్లాడుతూ.. యువకులు ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. ప్లాస్టిక్ నిరోధానికి కృషి చేయాలన్నారు. ఎస్సై ఎల్ రామ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాకారం రవి, బీజేపీ జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్, మాజీ సర్పంచ్ రాజారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ప్రవీణ్, ఆసిఫ్, దిగంబర్, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు దీపక్ తదితరులు పాల్గొన్నారు.