
కస్తూర్బాల్లో అడ్మిషన్లకు క్రేజీ
● వేసవిలోనే సీట్లు భర్తీ
● బాలికలకు అందుతున్న మెరుగైన విద్య
● సీట్ల సంఖ్య పెంచాలని డిమాండ్
మోర్తాడ్(బాల్కొండ): కస్తూర్బా గురుకులాల్లో చదు వుకోడానికి విద్యార్థినులు ఆసక్తి చూపుతున్నారు. వేసవిలోనే అడ్మిషన్ల కోసం ఎంతో మంది పేర్లు నమోదు చేయించుకోవడంతో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని కస్తూర్బా పాఠశాలల్లో సీట్లు నిండిపోవడం విశేషం. ఇంటర్ అప్గ్రేడ్ చేసిన చోట ప్రథమ, ద్వితీయ సంవత్సర తరగతుల్లోను సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. గతంలో కేవలం బడి మానివేసిన బాలికల కోసమే కస్తూర్బా పాఠశాలల్లో అడ్మిషన్లు ఇచ్చేవారు. డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించడం కోసం బాలికలు ఏ తరగతిలో బడి మానివేస్తే ఆ తరగతిలో అడ్మిషన్ ఇచ్చి చదువు చెప్పేవారు. కస్తూర్బా పాఠశాలల ఏర్పాటు లక్ష్యం ఎలా ఉన్నా రానురాను రెగ్యులర్ విద్యార్థినుల కోసమే తరగతుల నిర్వహణ సాగుతోంది. మోర్తాడ్, భీమ్గల్, బాల్కొండ, మెండోరా కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్ విద్యను అమలు చేస్తున్నారు. మెండోరాలో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ తరగతులు మొదలుకానున్నాయి. ఇక్కడ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు జారీ చేస్తున్నారు. కమ్మర్పల్లి, ఏర్గట్ల, ముప్కాల్, వేల్పూర్ పాఠశాలలను ఇంకా అప్గ్రేడ్ చేయలేదు. గదుల కొరత ఇతర కారణాల వల్ల నాలుగు చోట్లనే ఇంటర్ విద్యను బోధిస్తున్నారు. ప్రతి పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతున్నారు. ఈ తరగతులకు సంబంధించి ప్రతి పాఠశాలలో 200 చొప్పున సీట్లు భర్తీ అయ్యాయి. ఏర్గట్ల పాఠశాలలో పాఠశాల విద్యార్థుల సంఖ్య 270 కి చేరింది. అడ్మిషన్లు ఎక్కువ కావడంతో వారికి మెస్ చార్జీల కోసం ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్న చోట ప్రథమ, ద్వితీయ తరగతులకు సంబంధించి 160 సీట్లు భర్తీ అయ్యాయి. బాలికల కోసం ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలలను నిర్వహిస్తున్నా కస్తూర్బా పాఠశాలల్లో సైతం సీట్లు పూర్తిగా నిండటం గమనార్హం. ఇంటర్కు సంబంధించి ఎంపీసీ, బైపీసీ, నర్సింగ్, సీఈసీ గ్రూపులలో తరగతులను నిర్వహిస్తున్నారు.
ఇంగ్లీష్ మాధ్యమానికి డిమాండ్ ఏర్పడటంతో అన్ని చోట్ల ఆంగ్ల మాధ్యమంలో తరగతుల నిర్వహణ సాగుతోంది. ఏది ఏమైనా కస్తూర్బా పాఠశాలల్లో సీట్లు నిండిపోవడం, ఇంకా అడ్మిషన్ల కోసం అనేక మంది ఆసక్తి చూపుతుండటంతో సీట్ల సంఖ్య పెంచాలనే డిమాండ్ ఏర్పడింది.
ఏర్గట్లలోని కస్తూర్బా పాఠశాల భవనం
కొత్తవారికి అడ్మిషన్లు ఇవ్వలేకపోతున్నాం
కస్తూర్బా పాఠశాలల్లో సీట్లు గడచిన వేసవిలోనే భర్తీ అయ్యాయి. సీట్లు నిండిపోవడంతో కొత్తగా అడ్మిషన్ల కోసం వచ్చేవారికి ఎలాంటి సహకారం అందించలేకపోతున్నాం. సీట్ల సంఖ్య పెంచడం అందుకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరిస్తేనే కొత్త అడ్మిషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది.
– స్వప్న, ప్రత్యేకాధికారిణి, మోర్తాడ్

కస్తూర్బాల్లో అడ్మిషన్లకు క్రేజీ