
నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలి
డిచ్పల్లి: వర్షాకాలం ప్రారంభమైనందున వనమహోత్సవంలో భాగంగా నాటేందుకు అన్ని గ్రామ నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలని డిచ్పల్లి ఎంపీడీవో బుక్య లింగం నాయక్ సూచించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీలో కొత్తగా చేర్చిన పనులపై జీపీ కార్యదర్శులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి కూలీలకు రోజుకు రూ.300 వచ్చేలా చూడాలన్నారు. ఎకరం నుంచి 5 ఎకరాల వరకు ఉన్న రైతుల భూముల్లో హార్టికల్చర్ ద్వారా పండ్ల తోటల పెంపకం దరఖాస్తులు స్వీకరించాలన్నారు. అలాగే ప్రతి ఇందిరమ్మ ఇంటికి ఇంకుడు గుంత, వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పకుండా ఉండేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్ గౌడ్, ఏపీవో మంజుల, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ సుధాకర్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు ఉమేశ్, పరమేశ్వర్, సాయికుమార్, అరుంధతి, ఆపరేటర్లు అన్నపూర్ణ, అనూష, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్అసిస్టెంట్లు, మేట్లు తదితరులు పాల్గొన్నారు.