
భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ
డిచ్పల్లి: మండలంలోని ముల్లంగి(ఐ) గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. అనంతరం ఇటీవలే నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, మాజీ ఎంపీపీ చిన్నోల్ల నర్సయ్య, సొసైటీ ఛైర్మన్ గ్యానాజి గంగారెడ్డి, ఏఎంసీ డైరక్టర్ గంగారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.