
ప్రైవేటు బస్సుల నిలువు దోపిడీ
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ముంబైకి వెళుతున్న ప్రయాణికులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ముంబైకి టీజీఎస్ ఆర్టీసీ ఒకటే బస్సు నడపడంతోపాటు ప్రయాణికుల సంఖ్యకు సరిపడా రైళ్లు లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. వేసవి సెలవులు ముగియడం, విద్యా సంస్థలు పున: ప్రారంభం కావడంతో ముంబై నుంచి తెలంగాణ జిల్లాలకు వచ్చిన వారు తిరుగు పయనమవుతున్నారు. దీంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు టికెట్ ధరలను అమాంతం పెంచడంతో తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.
ఆర్టీసీ సీట్లు ఫుల్..
వేములవాడ డిపో నుంచి లహరి బస్సు ఒక్కటే ముంబైకి ప్రయాణికులను చేరవేస్తుంది. ఈ బస్సులో స్లీపింగ్ బెర్త్కు రూ.1,700లు, సీటు కోసం రూ.1,300ల చార్జీ వసూలు చేస్తున్నారు. ఒకే బస్సు ఉండటంతో రెండు, మూడు రోజుల టిక్కెట్లు ముందుగానే బుకింగ్ అయిపోతున్నాయి. కాగా, నిజామాబాద్ నుంచి దేవగిరి ఎక్స్ప్రెస్(రైలు) ఒక్కటే ముంబైకి ప్రతి రోజూ వెళుతుంది. దీంతో ఆ రైలు కాస్తా ప్రయాణికులకు కిక్కిరిసిపోతుంది.
ముంబైకి వెళ్లే ప్రయాణికుల జేబులకు చిల్లు
ట్రావెల్ బస్సుల్లో అడ్డగోలు చార్జీలు
ఆర్టీసీ బస్సు ఒకటే నడపడంతో ఇబ్బందులు
ఒక్క టికెట్ రూ.2,500
సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇదే అదనుగా భావిస్తున్న టావెల్స్ ఆపరేటర్లు టికెట్ల ధరలను పెంచేశారు. గతంలో స్లీపింగ్ బస్సులో ఒక్కో టిక్కెట్కు రూ.1,200 ల నుంచి రూ.1,300 ల చార్జీ వసూలు చేసేవారు. ఇప్పుడు రూ.2,500 లకు టిక్కెట్ ధర పెంచారు. సీటులో కూర్చొని ప్రయాణించేవారికి రూ.900 ల చార్జీ ఉండగా రూ.1,700 లకు పెంచారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్ బుకింగ్ పాయింట్ల నుంచి ముంబైకి ప్రయాణం సాగుతుంది.
ఎక్కడి నుంచి బస్సు ఎక్కినా ఒక్కటే చార్జీని వసూలు చేస్తున్నారు. నిత్యం ఆరు, ఏడు ప్రయివేటు బస్సులు రెండు జిల్లాల నుంచి ముంబైకి ప్రయాణికులను తరలిస్తున్నాయి. కాగా, ముంబై నుంచి వచ్చే వారికి కూడా ఇదే విధమైన చార్జీలను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తెలిపారు. ప్రైవేటు బస్సుల చార్జీల నియంత్రణకు చర్యలు తీసుకునేవారు లేకపోవడంతో ఆపరేటర్లు చెప్పినంత ధరకు టికెట్లను కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇద్దరికి రూ.5 వేలు
ముంబైకి అత్యవసరంగా వెళ్లాల్సి ఉంది. చార్జీలు పెరిగినా తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్లను కొనుగోలు చేసి బయల్దేరాం. నేను, నా భార్య ఇద్దరికే స్లీపర్ సీట్లకు రూ.5 వేలు ఖర్చు చేశాం. ఆర్టీసీ సంస్థ బస్సులను నడిపితే ప్రయాణికులకు ప్రయోజనంతోపాటు ప్రైవేటు బస్సుల్లో చార్జీలు నియంత్రణలోకి వచ్చేవి. – రాజన్న, తొర్తి(ముంబై)