
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యం
సుభాష్నగర్: జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా సబ్ డివిజన్, సెక్షన్ల వారీగా విద్యుత్ భద్రతపై వినియోగదారులకు పూర్తి అవగాహన వచ్చేలా విస్తృత ప్రచారం చేపట్టాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. వరంగల్లోని సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, టెక్నికల్ డీఈలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ పనులు చేసే క్రమంలో సిబ్బంది జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రమాదాలు జరిగే అవకాశమున్న లూజ్ లైన్లు, వంగిన, తుప్పు పట్టిన పోల్స్, తక్కువ ఎత్తులో ఉన్న డీపీఆర్ ప్లిన్త్లు, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ వచ్చే వాటిని గుర్తించి మార్చాలన్నారు. రైతులు, విద్యుత్ వినియోగదారులు వారి పరిధిలో లూజ్ లైన్లు, తక్కువ ఎత్తులో ఉన్న డీటీఆర్ ప్లిన్త్లు, ప్రమాదకరంగా ఉన్న వాటిని గుర్తించి సెక్షన్ ఆఫీసర్కు తెలపాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ పనులు చేయొద్దని, విద్యుత్ సమస్య తలెత్తితే 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సేవలు పొందాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి సర్కిల్లో టెక్నికల్ డీఈలను సేఫ్టీ అధికారులుగా నియమించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఫీల్డ్ సిబ్బంది నుంచి సీనియర్ అధికారుల వరకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. వీసీలో ఇన్చార్జి డైరెక్టర్లు బీ అశోక్కుమార్, టీ మధుసూదన్, సీఈలు రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, జీఎంలు ఉత్తమ్, సురేందర్, ఎస్ఈలు, డీఈ టెక్నికల్, డీఈ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భద్రతపై విస్తృత ప్రచారం చేపట్టాలి
టెక్నికల్ డీఈలను సేఫ్టీ అధికారులుగా నియమించాలి
వీసీలో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్రెడ్డి