
పసుపు సాగుకు పూర్వవైభవం
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం తిమ్మా పూర్కు చెందిన రైతు ఎన్ రాజేశ్వర్ పసుపు సాగు ను పున:ప్రారంభించారు. గతంలో పసుపు సాగుతో నష్టాలను మూటగట్టుకున్నాడు. దీంతో ఐదేళ్లపాటు పసుపు పంటకు విరామం పలికాడు. గడిచిన సీజన్లో సాగైన పసుపు పంటకు ధర గరిష్టంగా క్వింటాలుకు రూ.16 వేలు పలకడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. తన వద్ద విత్తనం లేకపోవడంతో తోటి రైతుల వద్ద ఒక్కో క్వింటాలుకు రూ.4 వేల ధర చెల్లించి ఆరు క్వింటాళ్లను కొనుగోలు చేశాడు. ఇదే గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్ గతంలో మూడెకరాల్లో పసుపు సాగు చేయగా ఈసారి మరో ఎకరం సాగు విస్తీర్ణం పెంచాడు. ఇలా రాజేశ్వర్, రాజశేఖర్లే కాకుండా అనేక మంది రైతులు పసుపు సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. పసుపు సాగుకు పూర్వ వైభవం తెచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.
గతంలో 50 వేల ఎకరాలు..
పసుపు పంట సాగుకు ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు 50 వేల ఎకరాల వరకు రైతులు సాగు చేసేవారు. పసుపు సాగుతో వ్యవసాయ కూలీలకు విస్తృతమైన ఉపాధి లభించేది. సాగు ఖర్చులు పెరగడం, ధర తగ్గిపోయి రైతులు నష్టాలను మూటగట్టుకున్న సందర్భాలు అనేకం. దీంతో సాగు విస్తీర్ణం ఏటా తగ్గుతూ వచ్చింది. అనేక మంది రైతులు పసుపునకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను ఎంచుకున్నారు. ఈసారి పసుపు పంటకు ధర ఆశాజనకంగా ఉండటం, కేంద్ర ప్రభుత్వం జిల్లాకు పసుపు బోర్డు మంజూరు చేయడంతో పసుపు పంట సాగుకు ప్రోత్సాహం అందినట్లయ్యింది. పసుపు సాగుకు వెన్నుదన్నుగా నిలిచిన బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో సాగు విస్తీర్ణం మునుపటికంటే ఎక్కువ పెరుగుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామమని రైతులు చెబుతున్నారు.
బోర్డు ఏర్పాటుతో ప్రయోజనాలు
సాగు విస్తీర్ణం ఏటా పెరగడానికి ఇలాంటి ప్రోత్సాహం అవసరం. ధర పెరగడంతో రైతులకు లాభాలు వస్తాయి. పసుపు బోర్డు ఏర్పాటుతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతుండటంతో అందరి దృష్టి మళ్లీ పసుపు సాగుపై వైపు పడింది.
– గడ్డం శ్రీనివాస్రెడ్డి, రైతు, దొన్కల్
ఎంపీ, కేంద్రానికి రుణపడి ఉంటాం
ఎంపీ అర్వింద్ చొరవ తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు పసుపు బోర్డును మంజూరు చేసింది. పసుపు పండించే రైతులకు ప్రోత్సా హం లభిస్తుండటంతో విస్తీర్ణం పెరగడానికి అవకాశం ఏర్పడింది. ఎంపీ, కేంద్రానికి రుణపడి ఉంటాం. – సోమ పెద్ద రాజారెడ్డి, రైతు, గుమ్మిర్యాల్
పసుపు సాగు సంవత్సరాల వారీగా
జిల్లాలో పెరుగుతున్న విస్తీర్ణం
గత సీజన్లో 23 వేల ఎకరాల్లో సాగు
ఈసారి 28 వేల ఎకరాలకుపైగా
పండించేందుకు రైతుల మొగ్గు
బోర్డు ఏర్పాటు, మంచి ధర
లభించడంతో ఆసక్తి

పసుపు సాగుకు పూర్వవైభవం

పసుపు సాగుకు పూర్వవైభవం

పసుపు సాగుకు పూర్వవైభవం