
ప్రజాపాలన పేరుతో పోలీసు పాలన
వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో పోలీసు పాలన కొనసాగిస్తోందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో ప్రజాపాలన పేరుమీద రాక్షస పాలన నడుస్తోందని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణ ఇటీవల భీమ్గల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీకి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చినపుడు ఏమి జరిగిందో ప్రజలంతా చూశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. మహిళలకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ఇస్తామన్న పింఛన్లు, బాల్కొండ నియోజకవర్గంలో రూ. రెండు లక్షల రుణమాఫీ అందరకీ రాలేదని మంత్రిని అడిగితే అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ చేశారన్నారు. తనను, కేసీఆర్ను డౌన్ డౌన్ అంటూ దాడికి సిద్ధమయ్యారని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ వారిని ఏమాత్రం అదుపు చేయకుండా, కేవలం ప్లకార్డులు పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేసి తీవ్రంగా కొట్టారని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ఇన్చార్జి సునీల్రెడ్డి పోలీసులను ఆదేశించి తనపై, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 30 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టించాడని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాడుతామని వెల్లడించారు.
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి