ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపాలిటీలో పాలకవర్గం మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. ప్రజాసమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన కౌన్సిల్ సమావేశం కో రం లేక వాయిదా పడటం, అనంతరం నిర్వహించిన సమావేశంలోనూ రెండు తీర్మానాలకే ఆమో దం లభించడం చర్చనీయాంశంగా మారింది. గత నెలలో కోరం లేక సమావేశం వాయిదా పడగా, తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ కౌన్సిలర్ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి ప నులు ముందుకుసాగడం లేదని, నిధుల కేటాయింపు, పనుల మంజూరు, అమలుపై స్పష్టత లేదని పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమృత్ 2.0 పనులపైనా సమావేశంలో పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఉద్యోగుల బహిష్కరణతో వివాదం
చైర్పర్సన్ భర్త తమతో దురుసుగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఎనిమిది మంది మున్సిపల్ ఉద్యోగులు సమావేశాన్ని బహిష్కరించి కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు కొందరు కౌన్సిలర్లు, నాయకుల ఒత్తిళ్లతో అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చైర్పర్సన్, వైస్ చైర్మన్ పేర్కొన్నారు.
ప్రమాణ స్వీకార ఖర్చుపైనా అభ్యంతరం
ఇటీవల జరిగిన చైర్పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఖర్చును కౌన్సిల్ అజెండాలో చేర్చడంపైనా పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని వారు కోరారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో నెలకొన్న పరిస్థితులతో పాలకవర్గం, అధికారుల మధ్య సమన్వయం కొరవడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు తదితర ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ ఉద్యోగుల సమావేశం బహిష్కరణ, ఉద్యోగుల ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. మున్సిపాలిటీలో విభేదాలు సమసిపోతాయా.. లేదా.. మరింత ముదురుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.


