ఖానాపూర్: మండలంలోని సత్తనపల్లి గ్రామంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల విత్తనాలు ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామంలోని ఆదిలాబాద్ రైతు ఉత్పత్తిదారుల ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యానవన అధికారి స్పందన 72 మంది రైతులకు విత్తనాలు అందజేశారు. అధికారులు మాట్లాడుతూ.. కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందిస్తోందని తెలిపారు. సబ్సిడీ విత్తనాలు కావాల్సిన రైతులు సత్తనపల్లి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కూరగాయల మార్కెటింగ్ కోసం 50 శాతం సబ్సిడీతో కూరగాయల పెట్టెలు (బాస్కెట్లు) కూడా అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయానంద్, రైతు ఉత్పత్తిదారుల సంస్థ చైర్మన్ సిడాం ఆనంద్రావు, వైస్ చైర్మన్ ఓసు నారాయణ, డైరెక్టర్లు కమల, గంగప్రసాద్, అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ కోఆర్డినేటర్ సుమన్ కుమార్, సంస్థ ప్రతినిధులు పవన్, సుప్రియ, రైతులు పాల్గొన్నారు.


