తానూరు: మహారాష్ట్ర సరిహద్దులోని ఎల్వత్ శివారు ప్రాంతంలో 177 సర్వే నంబర్లో 40 ఎకరాల భూమిలో మహారాష్ట్ర అక్రమార్కులు అక్రమంగా చేపడుతున్న మొరం తవ్వకాలను రెవెన్యూ అధికారులు బుధవారం పరిశీలించారు. గతంలో ఎల్వత్ గ్రామానికి చెందిన 41 మంది భూమి లేని నిరుపేదలు సాగుచేసుకోవడానికి సర్వే నంబర్ 177లో 63.17 ఎకారల భూమిని పంపిణీ చేశారు. ఈ భూముల్లో కొందరు సాగు చేసుకుంటుండగా కొందరు సాగుకు యేగ్యంగా లేదని వదిలేశారు. ఎర్ర మొరం కావడంతో కొందరు మహారాష్ట్ర అక్రమార్కులు నిర్మాణాలకు బాగుంటుందని తెలుసుకున్నారు. అసైన్డ్దారుల నుంచి లీజుకు తీసుకుని సూమారు 40 ఎకరాల్లో 50 అడుగుల లోతు వరకు మొరం తవ్వకాలు చేస్తూ మట్టిని మహారాష్ట్రకు తరలించుకుపోతున్నారు. అక్రమ తవ్వకాలు, రవాణాపై ‘సాక్షి’లో అనేకసార్లు వెలుగులోకి తెచ్చింది. అధికారులు నోటీసులు ఇచ్చినా తీరు మారలేదు. కోట్లలో దందా సాగిస్తున్నారు.
మొరం గుంతల పరిశీలన..
కలెక్టర్ మంగళవారం చర్యలకు ఆదేశించడంతో బుధవారం రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని గుంతలను పరిశీలించారు. సూమారు 40 ఎకరాల్లో 50 అడుగులోతులో తవ్వకాలు జరిపినట్లు రికార్డులు తయారు చేశారు. సంబంధిత లబ్ధిదారులకు నోటీసులను అందించారు. మొరం తవ్వకాలు జరగకుండా అక్కడి సరిహద్దు ప్రాతంలో బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సర్వేయర్ కిషన్, ఆర్ఐ సాయికిరణ్, జీపీవో రవికుమార్, రెవెన్యూ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.


