ముగిసిన పత్తి కొనుగోళ్లు..!
భైంసాటౌన్: జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లు తుదిదశకు చేరాయి. ఈనెల 20తో సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. జిల్లాలోని నిర్మల్, భైంసా, కుభీర్, సారంగపూర్ మార్కెట్యార్డుల పరిధిలోని పత్తి జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నవంబర్ నుంచి కొనుగోళ్లు ప్రారంభం కాగా, 95 శాతం మంది రైతులు పత్తి విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు. పత్తి విక్రయించిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ఉండగా, తేమ శాతాన్ని బట్టి రూ.7,690 నుంచి రూ.8,010 వరకు చెల్లించారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. సీజన్ ప్రారంభంలో వరుస వర్షాలతో పత్తి దిగుబడి తగ్గింది. గతేడాది సీసీఐలో 8.18 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరించగా, ఈసారి 5.60లక్షల క్వింటాళ్లు మాత్రమే సేకరించారు. దీంతోపాటు సీసీఐ కేంద్రాల ఏర్పాటులో జాప్యం కారణంగా రైతులు ప్రైవేట్లో విక్రయించి మద్దతు ధర లభించక నష్టపోయారు. నవంబర్ నుంచి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభం కాగా, నిర్మల్, భైంసా, కుభీర్, సారంగపూర్ మార్కెట్ల పరిధిలో కేంద్రాలు తెరిచారు. అయితే, ఈసారి కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానం తెచ్చింది. దీంతో తొలుత రైతులకు అవగాహన లేక ఆందోళనకు గురయ్యారు. స్మార్ట్ ఫోన్లు లేక, యాప్పై అవగాహన లేక ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారులు రైతులకు అవగాహన కల్పించి, ఇబ్బందులు తొలగించారు.
సీసీఐ కేంద్రాలు 05
విక్రయించిన
రైతులు 41,048
సేకరించిన పత్తి
5,60,179.9 క్వింటాళ్లు
ప్రైవేట్లో సేకరించిన పత్తి 21,055.7 క్వింటాళ్లు


