కడ్తాల్లో మకర జ్యోతి దర్శనం
లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీధర్మశాస్త్ర ఆలయం బుధవారం అయ్యప్ప నామస్మరణ, సంకీర్తనలు, శరణు ఘోషతో మార్మోగింది. ఆలయంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ అనంతరం విశేషపూజలు చేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహం, ఆభరణాలను ప్రత్యేకంగా అలంకరించిన పల్ల కిలో గ్రామ పురవీధులగుండా భాజాభజంత్రీల మధ్య ఊరేగించారు. అనంతరం ఆభరణాలను స్వామివారికి అలంకరించారు. ఉమ్మడి జిల్లాలోనే మొదటి అయ్యప్ప ఆలయం కావడంతో భక్తులు అధికసంఖ్యలో హాజరై మణికంఠుడిని దర్శించుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రివేళ మకర జ్యోతి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీధర్మశాస్త్ర ట్రస్టు సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.


