
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు..
● బేస్మెంట్ పైసలు పడుతున్నాయ్ ● లబ్ధిదారులకు ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమ ● అవకతవకలు జరగకుండా ఏఐ టెక్నాలజీ వినియోగం
నిర్మల్చైన్గేట్: తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంత గూడు కలను సాకారం చేస్తోంది. జిల్లాలో 1,92,233 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా, తొలి విడతలో ఎంపికై న లబ్ధిదారుల బేస్మెంట్ పనులు చకచకా పూర్తవుతున్నాయి. వీరి ఖాతాల్లో రూ.లక్ష మొదటి విడత నిధులు జమవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
1,444 ఇళ్ల మంజూరు
పైలట్ ప్రాజెక్ట్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, 18 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల్లో 1,444 ఇళ్లు మంజూరయ్యాయి. కలెక్టర్ 1,159 దరఖాస్తులను ఆమోదించగా, 1,101 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. 300 ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. బేస్మెంట్ పూర్తి చేసిన 36 మందిలో ఇద్దరికి రూ.లక్ష చొప్పున జమ చేశారు. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కసరత్తు కొనసాగుతోంది.
ఎల్–1 కేటగిరీలో 61,338 దరఖాస్తులు
దరఖాస్తుదారులను ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీలుగా విభజించారు. సొంత స్థలం ఉన్నవారు ఎల్–1లో, స్థలం లేనివారు ఎల్–2లో, తల్లిదండ్రుల నుంచి విడిపోయిన సంతానం ఎల్–3లో చేరారు. ఎల్–1లో 61,338 దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. అర్హుల జాబితాను కలెక్టర్, ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశీలించి దశలవారీగా ఎంపిక చేస్తారు.
ఏఐతో అవకతవకల నియంత్రణ
ఇళ్ల నిర్మాణంలో అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోంది. బేస్మెంట్ ఫొటోలను గృహ యాప్లో అప్లోడ్ చేసి, పరిశీలన అనంతరం బిల్లులు మంజూరు చేస్తారు. నాలుగు విడతల్లో రూ.5 లక్షలు జమ చేస్తారు. బేస్మెంట్కు రూ.లక్ష, పైకప్పుకు రూ.లక్ష, గోడలు ఇతర నిర్మాణానికి రూ.2 లక్షలు, పూర్తయ్యాక రూ.లక్ష మంజూరు చేస్తుంది.
మిగిలిన గ్రామాల్లో వేగవంతం
తొలి విడతలో ఒక్కో మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు, ఇప్పుడు అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేశారు. ఈ నెల 30లోపు పరిశీలన పూర్తి చేసి, వచ్చే నెల 2న అర్హుల జాబితా ప్రకటిస్తారు.
వివరాలు:
పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు
చేసిన ఇళ్లు 1,444
కలెక్టర్ అప్రూవ్ చేసినవి 1,159
ప్రొసీడింగ్ పొందినవారు 1101
ఇప్పటివరకు మార్కింగ్ చేసినవి 300
బేస్మెంట్ లెవల్ పూర్తయినవి 36
లక్ష రూపాయలు అందినవారు 2