
ధరణి సమస్యలు భూభారతితో పరిష్కారం
లోకేశ్వరం/నర్సాపూర్(జి): భూ భారతి చట్టంతో ధరణిలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కా రం అవుతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. లోకేశ్వరం, నర్సాపూర్(జి) మండల కేంద్రాల్లోని రైతు వేదికలో భూభారతి చట్టంపై గురువారం వేర్వేరుగా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ రైతులకు వారి భూములపై సమగ్ర హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూభారతి (నూతన ఆర్ఓఆర్)2025 చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందని తెలిపారు. గ్రామ పాలన అధికారుల నియామకంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూములపై పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం క్రమబద్ధీకరించేందుకు భూభారతిలో వీలు కల్పించిందని పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి వార్షికంగా వాటిని ప్రజల ముందు ప్రదర్శిస్తారని, ఆధార్ తరహాలో భూమికి ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించి అక్రమణలకు అడ్డుకట్టవేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు వారి భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు అడిగిన భూ సమస్యలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, భైంసా మార్కెట్ కమిటీ చెర్మన్ ఆనంద్రావు పటేల్, నిర్మల్ మార్కెట్ కమిటీ చెర్మన్ భీంరెడ్డి, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీల్దార్లు మోతీరాం, శ్రీనివాస్, ఎంపీడీవోలు వెంకటరమేశ్, పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్రావు, నర్సాపూర్(జి) మండల ప్రత్యేక అధికారి అంజిప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి●
లోకేశ్వరం: వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున రైతులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా టెంట్ ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వహించే రికార్డులను, వరి ధాన్యంలో తేమ శాతంను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టరు కిశోర్కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, ఏపీఎం మల్లేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
లోకేశ్వరం, నర్సాపూర్(జి) మండలాల్లో అవగాహన సదస్సులు

ధరణి సమస్యలు భూభారతితో పరిష్కారం