‘పుర’ ఓటర్లు 1,69,285
భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వార్డుల వారీగా 2025 అక్టోబర్ 1వ తేదీ నాటి అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాను అనుసరించి రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ఈ నెల 1న విడుదల చేశారు. 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కూడా సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 10న ఓటర్ల తుది జాబితాలను విడుదల చేయాల్సి ఉండగా, సవరణకు మరో రెండు రోజులు గడువు విధించారు. ఆ మేరకు అభ్యంతరాలు సవరించి సోమవారం ఓటరు తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు రోజంతా తలమునకలయ్యారు. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఓటరు తుది జాబితాలు సాయంత్రానికే విడుదల చేయగా, భైంసాలో ఆలస్యంగా విడుదల చేశారు. తుది జాబితాలను మున్సిపల్ కార్యాలయాలతోపాటు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అలాగే పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ సైతం పూర్తి చేసి, 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా, 16న ఓటరు ఫొటోలతో కూడిన జాబితా వెలువరించనున్నారు.
వార్డులవారీగా సవరణ...
ఓటరు ముసాయిదా జాబితాలో ఎక్కువగా ఒక వార్డులోని ఓటర్లు మరోవార్డులో, ఒకే ఇంటి ఓటర్లు వేర్వేరు వార్డుల్లో.. ఇలా నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు కుప్పలుగా వచ్చాయి. దీంతో మున్సిపల్ అధికారులు వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షేత్రస్థాయిలో విచారించి సవరించారు. నిర్మల్ మున్సిపల్లో 501, భైంసాలో 114, ఖానాపూర్లో 580 అభ్యంతరాలు రాగా, వాటన్నింటినీ వార్డుల వారీగా పరిశీలించి ఓటర్లను సర్దుబాటు చేశారు. ఈ మేరకు తుది జాబితా రూపొందించి విడుదల చేశారు.
మున్సిపాలిటీలవారీగా ఓటర్ల వివరాలిలా...
పట్టణం వార్డులు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం
నిర్మల్ 42 50,824 47,362 18 98,204
భైంసా 26 25,623 25,486 09 53,118
ఖానాపూర్ 12 9,169 8,524 00 17,693


